పాలు తాగితే బలం వస్తుంది, ఇది అందరికి తెలిసిన విషయమే. ఆరోగ్యంతో పాటు అందానికి కూడా పాలు కావాల్సిందే. మీ చర్మం కాంతిమంతంగా మెరవాలన్నా, మృదువుగా మారాలన్నా పాలను మించిన పదార్థం మరొకటి లేదు. పాలతో అందానికి మరింత మెరుగులు ఎలా దిద్దుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
కాంతివంతంగా మారడానికి
కప్పు పచ్చిపాలూ, పావు కప్పు తేనె, అయిదు చుక్కల కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చటి నీటికి కలిపి స్నానానికి ఉపయోగించాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలిగిపోయి మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. పాలలో విటమిన్ ఎ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది చర్మాన్ని పొడారిపోకుండా చూస్తుంది.
పిగ్మెంటేషన్ తగ్గడానికి
పాలలోని లాక్టిక్ ఆమ్లం పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది. చర్మానికి కావాల్సిన తేమనూ అందిస్తుంది. సూర్య కిరణాల వల్ల కమిలిన చర్మానికి సాంత్వనను చేకూరుస్తుంది. పాలలో దూది ఉండను ముంచి ముఖంపై నెమ్మదిగా, మృదువుగా రాయాలి. పది-పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుండటం వల్ల మీ చర్మానికి కావాల్సిన తేమ అందడంతోపాటు మృదువుగా తయారవుతుంది.
మృదువుగా మారడానికి
ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఓట్మీల్, పాలు తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న ముఖానికి రాసుకోవాలి. దాన్ని మీ చేతివేళ్లతో మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మృతకణాలూ; అధికంగా ఉండే నూనెలు, దుమ్మూధూళి పోయి చర్మం శుభ్రపడుతుంది. పదిహేను నిమిషాలాగి చల్లటి నీటితో కడిగేయాలి.
మొటిమలు తొలిగిపోడానికి
పాలలోని లాక్టికామ్లం మొటిమలకు కారణమయ్యే సూక్ష్మజీవులతో సమర్ధంగా పోరాడుతుంది. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని పాలలో చిన్న దూది ఉండ ముంచి మొటిమలు ఉండే ప్రాంతంలో మృదువుగా రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అందమైన కాంతివంతమైన చర్మంకోసం ఇక్కడ తెలుసుకోగలరు.